కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. నగరంలో కరోనావైరస్ యొక్క ఏవై.4.2 కొత్త వేరియంట్ రెండు అనుమానిత కేసులు వెలుగుచూశాయి. ఈ కొత్త వేరియెంట్ ను గుర్తించేందుకు వీటి నమూనాలను జన్యు శ్రేణి కోసం ప్రయోగశాలకు పంపినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ చెప్పారు. శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్సీబీఎస్)కు పంపినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కూడా వైద్యాధికారులు తెలిపారు. ఏవై.4.2 అనే కొత్త వేరియెంట్ యునైటెడ్ కింగ్డమ్లో వేగంగా విస్తరిస్తున్న కరోనావైరస్ యొక్క డెల్టా వేరియంట్ అని వైద్యులు చెప్పారు. కాగా రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కొత్త వైరస్ వేరియెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, అది వారిపై తక్కువ ప్రభావం చూపుతుందని మంత్రి సుధాకర్ పేర్కొన్నారు.కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటకలో ఏడు జీనోమ్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కొత్త వేరియెంట్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.