బెంగళూరు : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం ఏదో ప్రాంతంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతోంది. తాజాగా బెంగళూరు నగరంలో 3 కిలోల సూడోఎఫెడ్రిన్ అనే డ్రగ్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి కోట్ల విలువైన 3 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని ఎన్సీబీ బెంగళూరు జోనల్ డైరెక్టర్ అమిత్ తెలిపారు. ఈ సరుకును ఆస్ట్రేలియా పంపడానికి సిద్ధం చేసినట్టు గుర్తించారు. ఈ నెల 21నే ఇందుకు సంబంధించిన పార్సిల్ను అడ్డగించి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ఆ పార్శిల్ను ఆస్ట్రేలియాకు పంపించడానికి సిద్ధం చేసినట్టు తేలినట్లు చెప్పారు. పార్శిల్ను తొలుత చెన్నైకి రవాణా చేసిన వ్యక్తిని గుర్తించినట్టు తెలిపారు. ఆ వివరాలను చెన్నైలోని ఎన్సీబీ అధికారులకు ఇచ్చామన్నారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల పాటు చేసిన దర్యాప్తులో పార్శిల్ పంపేందుకు నకిలీ చిరునామాలు, డాక్యుమెంట్లు వాడినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసి విచారిస్తున్నట్టు వివరించారు.