మహారాష్ట్ర నాందేడ్లో కొనసాగుతున్న జోడో యాత్రలో రాహుల్ గాంధీ
మహారాష్ట్ర నాందేడ్లో భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో విభజన బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేలా యువత చొరవ చూపాలని కోరారు. మీ జీవితంలో ఏ విషయానికైనా భయపడటం మానుకోవాలని, భయాన్ని హృదయాల నుంచి పారద్రోలి దేశం కోసం పనిచేయాలని యువతను కోరారు. తన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్లను దృష్టిలో పెట్టుకుని చేసినవి కాదని రాహుల్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఐదో రోజు తన పాదయాత్రను కొనసాగించిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 382 కిలోమీటర్లు నడుస్తారు. ఈనెల 20న రాహుల్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లోకి అడుగుపెడతారు. ఇక కాంగ్రెస్ నేత పాదయాత్రలో హింగోలి జిల్లాలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నేత ఆదిత్యా ఠాక్రే శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి నడవనున్నారు.