భారత్ పర్యటనకు విచ్చేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
దిల్లీలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు
నాలుగు రోజుల భారత పర్యటన కోసం సోమవారం దిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్కు చేరుకున్న షేక్ హసీనాకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.భారత ప్రధానితో చర్చల నిమిత్తం దేశ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకి సగౌరవంగా త్రివిధ దళాల సైనిక వందనంతో ఆహ్వానం పలికారు. అంతకుముందు మహాత్మా గాంధీ స్మారక స్థూపం రాజ్ఘాట్ వద్ద ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. రాష్ట్రపతి భవన్ దగ్గర మీడియాతో మాట్లాడిన షేక్ హసీనా.. భారత పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని తెలిపారు. భారత ప్రధాని మోదీపై షేక్ హసీనా పొగడ్తల వర్షం కురిపించారు. కరోనా సమయంలోనూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారత్ అందించిన సాయం గొప్పదని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరు దేశాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షతో సమైక్యంగా ముందుకు సాగుతామని షేక్ హసీనా అన్నారు. స్నేహంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం తమ ప్రధాన కర్తవ్యమని హసీనా తెలిపారు. ఈ సమస్యలన్నింటిపై భారత్, బంగ్లాదేశ్ దేశాలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. భారతదేశం బంగ్లాదేశ్ సత్సంబంధాలతో దక్షిణ ఆసియా అంతటా ప్రజలకు మెరుగైన జీవనం లభిస్తుందని,ఇదే తమ కర్తవ్యమని బంగ్లాదేశ్ ప్రధాని తెలిపారు.
రాష్ట్రపతి భవన్లో గౌరవ వందంనం స్వీకరణ తర్వాత ఇవాళ మధ్యాహ్నాం దిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో సమావైశన షేక్ హసీనా పలు విషయాలనై ఆయనతో చర్చించారు. నీరు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలకు సంబంధించిన ద్వైపాక్షిక ఇష్యూలపై ఇరు ప్రధానులు చర్చించారు. భారతదేశం,బంగ్లాదేశ్లు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , షేక్ హసీనా సమక్షంలో ఏడు అవగాహన ఒప్పందాలు పై సంతకాలు చేశాయి. అనంతరం భారత్-బంగ్లాదేశ్ ప్రధానులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ…ఇవాళ ఆసియా ప్రాంతంలో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్ అని, అభివృద్ధిలోనూ భారత్ కు బంగ్లాదేశ్ అతిపెద్ద భాగస్వామి అని మోదీ వివరించారు. ఇది ఇరుదేశాల ప్రజల మధ్య సహకారానికి సంబంధించిన విషయం అని, ఇది నిరంతరం పురోగమిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
‘భారతదేశం, బంగ్లాదేశ్ ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాయి. బంగ్లాదేశ్కు భారత్ అతిపెద్ద మార్కెట్. ఆసియా వ్యాప్తంగా బంగ్లాదేశ్ నుండి ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఈ పురోగతిని మరింత వేగవంతం చేయడానికి త్వరలో ద్వైపాక్షిక ఆర్థిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభిస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా భారత్-బంగ్లాదేశ్ మధ్య పరస్పర సహకారం పెరిగింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా , నేను వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించాము. కోవిడ్ మహమ్మారి ఇటీవలి ప్రపంచ సంఘటనల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. వరదల నివారణపై మేము మా సహకారాన్ని అందించాము. మేము బంగ్లాదేశ్తో వరదలకు సంబంధించిన రియల్ టైమ్ డేటాను పంచుకుంటున్నాము. ఉగ్రవాదంపై కూడా చర్చించాము. మనకు వ్యతిరేకమైన శక్తులను మనం కలిసి ఎదుర్కోవడం అత్యవసరం. 54 నదులు భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా ప్రవహిస్తాయి, రెండు దేశాల ప్రజల జీవనోపాధికి అనుసంధానించబడి ఉన్నాయి. ఈరోజు మేము కుషియారా నది నీటి భాగస్వామ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాం’ అని మోదీ తెలిపారు.