పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్కతా : క్రిస్మస్ రోజున మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థకు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ట్విట్టర్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థలోని 22 వేల మంది రోగులు, ఉద్యోగులు ఆహారం, మందులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ‘చట్టం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ, మానవతా ప్రయత్నాలలో రాజీ పడకూడదు’ అని టీఎంసీ అధ్యక్షురాలు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ‘షాకింగ్ న్యూస్’ అనే హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో సీపీఎం నాయకుడు సుర్జ్య కాంత మిశ్రా కూడా ఇదేవిధంగా స్పందించారు. ‘నిన్న క్రిస్మస్ రోజున కేంద్ర మంత్రిత్వ శాఖ మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. ప్రభుత్వం ఛారిటీ చేతిలో ఉన్న నగదుతో సహా భారతదేశంలోని అన్ని ఖాతాలను స్తంభింపజేసింది. వారి 22 వేల మంది రోగులు, ఉద్యోగులతో సహా ఆహారం, మందులు లేకుండా ఉన్నారు’ అని పునరుద్ఘాటించారు. కాగా మమతా బెనర్జీ పోస్ట్ను అనుసరించి, ఇతర పార్టీల నాయకులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పరిస్థితిని ‘అవమానకరమైనది’, ‘షాకింగ్’గా అభివర్ణించారు. ‘మదర్ థెరిసా నోబెల్ బహుమతిని గెలుచుకున్నప్పుడు భారతదేశం సంతోషిస్తుంది. ఆమె సంస్థ పేదలు, నిరుపేదలకు సేవ చేస్తున్నప్పుడు, ప్రభుత్వం వారి నిధులను నిలిపివేస్తుంది’ అని అన్నారు. అయితే క్రిస్మస్ సందర్భంగా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ దిల్లీకి హోం మంత్రిత్వ శాఖ నోటీసు వెళ్లింది. దీనిపై కలకత్తా ఆర్చ్ డియోసెస్ వికార్ జనరల్ ఫాదర్ డొమినిక్ గోమ్స్ మాట్లాడుతూ పేదలలోని పేదలకు ప్రభుత్వ సంస్థలు ‘క్రూరమైన క్రిస్మస్ బహుమతి’ అందించాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘క్రైస్తవ సమాజంపై తాజా దాడి’ అని ఎఫ్ఆర్ గోమ్స్ అన్నారు. ఈ చర్యను ఆయన ఖండిరచారు. ఇదిలాఉండగా, మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీత కుమార్ మీడియాతో మాట్లాడుతూ దీనిగురించి తమకు ఎవరూ ఏమీ చెప్పలేదన్నారు. దీని గురించి తనకు అసలు ఏమీ తెలియదన్నారు. భారత ప్రభుత్వం తమకు ఏమీ చెప్పలేదన్నారు. బ్యాంకు లావాదేవీలు సజావుగానే జరుగుతున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు.