పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ఫుల్గా తాగి విమానం ఎక్కారని, దాంతో ఆయన్ని ఫ్లైట్ నుంచి దించేశారని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖబీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. శనివారం ఇది జరిగిందని.. మాన్తో పాటు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు. ఆయన ప్రవర్తనతో భగవంత్ సింగ్ మాన్ పంజాబీలను అవమానపరిచారని సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భగవంత్మాన్ నడవలేని విధంగా ఉండడంతో లుఫ్తాన్సా విమానం నుంచి దించేశారని ప్రయాణికులు చెప్పారు. ఆయన వల్ల నాలుగు గంటల పాటు విమానం ఆలస్యమైంది. ఆప్ జాతీయ సమావేశానికి ఆయన దూరమయ్యారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బంది పెట్టింది. వారిన అవమానపరిచింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తమ సీఎంకి సంబంధించిన ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం నోరు మెదపలేదు.’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్టులో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నారని వచ్చిన వార్తలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కూడా సోమవారం డిమాండ్ చేసింది. బజ్వా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను విచారించి, కారణాన్ని తెలియజేయాలని ప్రతిపక్ష నాయకుడు పర్తాప్ సింగ్ ట్విట్టర్లో కోరారు. అయితే భగవంత్ మాన్పై వచ్చిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపడేసింది. ప్రధాన అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ కాంగ్ షెడ్యూల్ ప్రకారం పంజాబ్ సీఎం దిల్లీకి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి తన షెడ్యూల్ ప్రకారం తిరిగి వచ్చారు. సెప్టెంబర్ 18న జర్మనీ నుంచి తిరిగి విమానంలో బయలుదేరారు. సెప్టెంబర్ 19న ఆయన న్యూఢల్లీిలో దిగాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఇదంతా తప్పుడు ప్రచారం’’ అని కాంగ్ అన్నారు. ముఖ్యమంత్రిని అగౌరవపరిచేందుకు విపక్షాల నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అదేవిధంగా పంజాబ్కు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం నిరంతరం పనిచేస్తున్నారని వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.