స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన లారీ..నలుగురు చిన్నారులు మృతి
11 మందికి తీవ్ర గాయాలు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. నగ్దా-ఉన్హేల్ రహదారి దగ్గర రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ఓ లారీ.. స్కూల్ వ్యాన్ను ఢీకొట్టింది. దాంతో అక్కడికక్కడే నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.నగ్దాలోని ఫాతిమా కాన్వెంట్ స్కూల్కు చిన్నారులు వెళ్తుండగా ఉన్హెల్ పట్టణంలోని జిర్నియా ఫాటా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యేంద్ర శుక్లా తెలిపారు. గాయపడినవారిలో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉండంతో వారిని ఇండోర్లోని ఆస్పత్రికి తరలించినట్టు తెలియజేశారు. మిగతా ఎనిమిది మంది పిల్లలను నగ్దాలోని నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్పించారు. మృతి చెందిన విద్యార్థులందరూ 11 నుంచి 18 ఏళ్ల వారే. అయితే సమయానికి అంబులెన్స్ రాకపోతే స్థానికులే ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో ఢీకొనడం వల్ల వ్యాన్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.