బీజేపీ కార్యవర్గంలో దక్కని చోటు
న్యూదిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. 80మందితో కూడిన జాబితాలో ప్రధాని నరేంద్రమోదీ మొదలుకొని కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషి వంటి సీనియర్ నేతలకు చోటు కల్పించిన బీజేపీ…మనేకాగాంధీ, వరుణ్గాంధీలను విస్మరించింది. తల్లీకొడుకులకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను మొదటి నుంచి బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ విమర్శిస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు అనుకూలంగా పదేపదే మాట్లాడుతున్నారు. ఈ కారణం వల్లే తల్లీకొడుకులకు పార్టీ పదవుల్లో చోటులేకుండా చేసినట్లు స్పష్టమవుతోంది. మనేకాగాంధీ, వరుణ్గాంధీ ఇప్పటి దాకా బీజేపీ కార్యకర్గంలో ఉన్నారు. వీరిద్దరితోపాటు రైతులపై సానుభూతి ప్రకటిస్తున్న కేంద్ర మాజీమంత్రి బీరేందర్సింగ్కు సైతం చోటు లభించలేదు. 80మంది కార్యవర్గంతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా, 179మందికి శాశ్వత ఆహ్వానితులుగా స్థానం కల్నించింది. పార్టీకి కార్యవర్గం అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను కూలంకషంగా చర్చిస్తుంది. సంస్థాగత అజెండాకు రూపల్పలన చేస్తుంది. కోవిడ్`19 కారణంగా బీజేపీకార్యవర్గం కూర్చులో చాలా జాప్యం జరిగింది. అమిత్షా, రాజ్నాథ్సింగ్ సహా అనేకమంది కేంద్రమంత్రులు, ఇటీవల కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న అశ్వనీ వైష్ణవ్లకు కార్యవర్గంలో స్థానం లభించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇటీవల జరిగిన రైతుల మారణకాండపైనా వరుణ్గాంధీ తీవ్రంగా స్పందించారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్మిశ్రా తనయుడు ఆశీష్మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన వీడియోలను సైతం వరుణ్ వైరల్ చేశారు. ‘ఈ వీడియో చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ హత్య ద్వారా రైతులు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అమాయక రైతుల రక్తానికి జవాబుదారీతనం ఉండాల్సిందే. అహంకారం, క్రూరత్వానికి సమాధానంగా బాధిత రైతులకు న్యాయం జరగాలి’ అని ఫిలిబిత్ ఎంపీ వరుణ్గాంధీ ఇటీవల ట్వీట్ చేశారు.