కోవిడ్-19 మహమ్మారి వల్ల సంభవించిన నష్టాల నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే పదేళ్లు అయినా పట్టొచ్చని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నివేదిక అంచనా వేసింది. కోవిడ్`19 ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించింది. ఈ మహమ్మారి సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన ఆదాయ నష్టం దాదాపు రూ.52 లక్షల కోట్లు అని అంచనా వేసింది.2021-22 ఆర్థిక సంవత్సరానికి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ (ఆర్సీఎఫ్)లో ‘మహమ్మారి మచ్చలు’ అనే అధ్యాయంలో ఈ మహమ్మారి ప్రభంజనాలు పదే పదే రావడం వల్ల నిలకడగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆటంకాలు ఏర్పడినట్లు తెలిపింది. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో త్రైమాసిక ధోరణులు ఈ మహమ్మారి ఆటుపోట్లకు గురైనట్లు పేర్కొంది. 2020-21 తొలి త్రైమాసికంలో తీవ్రమైన క్షీణత నమోదైన తర్వాత 2021-22 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రెండో ప్రభంజనం వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థ వేగం క్రమంగా పుంజుకుందని తెలిపింది. అదే విధంగా 2022 జనవరిలో మూడో ప్రభంజనం వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియకు పాక్షికంగా దెబ్బతగిలిందని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ, దేశీయ వృద్ధికి జరుగుతున్న నష్టాలు నిత్యావసరాల ధరల పెరుగుదలలోనూ, అంతర్జాతీయ సరఫరాల వ్యవస్థలో అంతరాయాల ద్వారానూ స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ నివేదికను ఆర్బీఐలోని ఆర్థిక, విధాన పరిశోధన శాఖ (డీఈపీఆర్) రూపొందించింది. ఈ నివేదికలోని అంశాలన్నీ పూర్తిగా కంట్రిబ్యూటర్స్కు చెందినవేనని, తన అభిప్రాయాలు కాదని ఆర్బీఐ వివరించింది.