కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే.. ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. శుక్రవారమే ఆయన పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్కరికి ఒకటే పదవి అన్న నియమం ప్రకారం ఆయన ఇవాళ రాజ్యసభలో ప్రతిపక్ష నేత పోస్టుకు రాజీనామా చేశారు.ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ పంపారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఖర్గేను అధినాయకత్వం అధ్యక్ష బరిలో నిలబెట్టడం ద్వారా ఆయన కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రచారం లో ఉన్నారు. గాంధీ కుటుంబం పట్ల విధేయత..పార్టీ పట్ల అంకిత భావం ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో అనేక హోదాలో ఆయన పని చేసారు. అధ్యక్ష పదవికి ఖర్గే ఎన్నిక ఖాయమంటూ.. దళిత వర్గానికి అందునా దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ చివరి నిమషంలో ఖర్గే పేరు తెర మీదకు తీసుకొచ్చింది. అధిష్ఠానం సూచనల మేరకే ఖర్గే చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఖర్గేకు పార్టీ నేతలతో పాటుగా.. జీ -23 నేతలు సైతం మద్దతుగా నిలిచారు. చివరి వరకూ దిగ్విజయ్ – శశి థరూర్ మధ్య అధ్యక్ష ఎన్నికల పోటీ ఉంటుందని అందరూ అంచనా వేసారు. చివరి నిమిషంలో ఖర్గే పేరు ఖరారు చేయటంతో దిగ్విజయ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఖర్గేకు మద్దతు ప్రకటించారు. దీంతో..ఖర్గే- శశి థరూర్ తో పాటుగా కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ నేతగా పని చేసిన జార్ఖండ్ నేత ఠాకూర్ కూడా నామినేషన్ దాఖలు చేసారు. ఈ నెల 8వ తేదీ వరకే నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈ నెల 17న ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు ప్రకటిస్తారు.