కేరళ, మహారాష్ట్రలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. కేరళలో మలప్పురం జిల్లా ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 160 మీజిల్స్ కేసులు నమోదయ్యాయని, అయితే వ్యాధి కారణంగా మరణాలు సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు పిల్లలకు తప్పకుండా టీకాలు వేయించాలని కేరళ ప్రభుత్వం తల్లిదండ్రులను కోరింది.తొమ్మిది నెలల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ల అదనపు డోస్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం రాష్ట్రాలను కోరింది. మీజిల్స్ వ్యాధి నివారణకు ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. జిల్లాలో ఎంఆర్ వ్యాక్సిన్, విటమిన్ ఎ సిరప్ తగిన మోతాదులో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో మీజిల్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఈ వ్యాధి యువకులను, పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వారం ప్రారంభంలో, మలప్పురం, రాంచీ (జారండ్), అహ్మదాబాద్ (గుజరాత్)లలో కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను నియమించింది.
మరోవైపు ముంబైలో కూడా మీజిల్స్ వ్యాధి సోకుకుంది. ఒక్క ముంబైలో 303 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో మీజిల్స్ సోకిన వారి సంఖ్య 717కి పెరిగింది. పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పటివరకు 14 మంది ప్రాణాలను బలిగొంది. ముంబైలో నవంబర్ 28 నాటికి మీజిల్స్ కారణంగా పది మృతి చెందారు. మంగళవారం ముంబైలో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. నాసిక్ జిల్లాలోని మాలెగావ్ నగరంలో 70, ముంబై సమీపంలోని భివాండిలో 48 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. 2019లో మహారాష్ట్రలో 1,337 కేసులు నమోదయ్యాయి. 2020లో 2,150 మంది మరియు 2021లో 3,668 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మహారాష్ట్రలో నమోదైన మీజిల్స్ కేసుల సంఖ్య ముంబైలో 303తో సహా 717కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.