ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం
న్యూదిల్లీ : లఖింపూర్ ఖేరీ హింస కేసులో రోజువారీ ప్రాతిపదికన రాష్ట్ర సిట్ దర్యాప్తును పర్యవేక్షించడానికి తనకు నచ్చిన మాజీ న్యాయమూర్తిని నియమించవచ్చని సుప్రీం కోర్టు చేసిన సూచనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. అక్టోబర్ 3న లఖింపూర్లో చోటుచేసుకున్న హింసలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సిట్ విచారణలో నిమగ్నమై ఉన్న కింది స్థాయి పోలీసు అధికారుల అంశాన్ని కూడా లేవనెత్తింది. దర్యాప్తు బృందంలో చేర్చడానికి యూపీ కేడర్కు చెందిన రాష్ట్రానికి చెందని ఐపీఎస్ అధికారుల పేర్లను మంగళవారం లోపు యూపీ ప్రభుత్వం సిఫార్సు చేయాలని కోరింది. అయితే ఈ సంచలనాత్మక కేసులో దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీం కోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లను కూడా పరిశీలిస్తామని, దానికి సంబంధిత న్యాయమూర్తి సమ్మతిని తీసుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కేసు దర్యాప్తుపై బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. దీనికి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సమ్మతిస్తూ, దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీం కోర్టు తనకు నచ్చిన మాజీ న్యాయమూర్తిని నియమించడంలో రాష్ట్రానికి ఎటువంటి సమస్యలు లేవని, కానీ అతను ఉత్తరప్రదేశ్కు చెందినవాడు కాకూడదనే విషయం సంబంధిత వ్యక్తి దృష్టిలో పెట్టుకోకూడదని అన్నారు. కాగా నవంబర్ 8న కేసు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు కొనసాగుతున్న దర్యాప్తులో ‘స్వాతంత్య్రం, నిష్పాక్షికత, న్యాయబద్ధత’ను నింపేందుకు వేర్వేరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు దీనిని రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షించాలని సూచించింది. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికోనియా-బన్బీర్పూర్ రహదారిపై చెలరేగిన హింసపై విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.