భువనేశ్వర్: ఒడిశాలోని స్థానిక సంస్థలకు మార్చి 24 నుంచి ఎన్నికలు జరపనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం తెలిపింది. ఈ ఎన్నికలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయని పేర్కొంది. మార్చి 26న ఫలితాలు విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏపీ పధి తెలిపారు. 47 మునిసిపాలిటీలు, 59 గుర్తింపు పొందిన ప్రాంతీయ కౌన్సిళ్లు, భువనేశ్వర్, కటక్, బెర్హంపూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ‘ఓట్లు వేసేందుకు సుమారు 41 లక్షలమంది అర్హులు. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. మార్చి 26 వరకూ అమల్లో ఉంటుంది. 1,763 మునిసిపాలిటీలు, ప్రాంతీయ కౌన్సిళ్లు, అలాగే మూడు మునిసిపల్ కార్పొరేషన్లలోని 168 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి’ అని పధి తెలిపారు. స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా ‘నోటా’ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. ‘ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను ఉపయోగిస్తున్నామని, ఎక్కడైతే ఎన్నికలు జరపనున్నామో అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది’ అని ఆయన వివరించారు. గురువారంతో ఒడిశాలో పంచాయతీ ఎన్నికలు ముగియగానే, స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే ప్రకటించారు. అభ్యర్థులు మార్చి 2 నుంచి 7వ తేదీ లోపు నామినేషన్లు దాఖలు చేయాలనీ, మార్చి 9న స్క్రూట్నీ నిర్వహిస్తామన్నారు. మార్చి 14లోపు నామినేషన్ల ఉపసంహరించుకోచ్చునని తెలిపారు. ఈ ఎన్నికల కోసం 4,584 బూత్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి బూత్లో రెండు ఈవీఎంలు ఉంటాయని, ఒకటి కౌన్సిలర్లను ఎన్నకునేందుకైతే, మరోటి చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నికునేందుకు ఉపయోగించాలని సూచించారు.