ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తన పదవికి రాజీనామా చేయాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండు చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) అధ్యక్షుడు కూడా అయిన రాందాస్ బుధవారం ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన కేసుల్లో ఈడీ అరెస్టు చేసిన మాలిక్ను ఇంకా మంత్రిమండలిలో కొనసాగించడంతో రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోందని ఆరోపించారు. మాలిక్ జైలులో ఉన్నారని, ఆయనే బాధ్యతగా తన పదవికి రాజీనామా చేసి తన వద్దనున్న సాక్ష్యాలను కోర్టు ముందుంచాలని డిమాండు చేశారు. మహా వికాస్ అఘాడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మాలిక్ మంత్రి పదవి నుంచి తప్పుకోడని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఎన్సీపీ అధినేత శరద్పవార్కు అన్ని విషయాలు తెలుసునని, ఆయన మాలిక్తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని సూచించారు. మాలిక్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న ప్రతిపక్ష బీజేపీ డిమాండ్కు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని పేర్కొన్నారు. గురువారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ కూటమి నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మాలిక్ను కావాలనే ఈ కేసుల్లో ఇరికించారని ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్రం తన చేతుల్లోని దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని మాలిక్ను ఈడీ ద్వారా అరెస్టు చేయించారని ఆరోపిస్తోంది.