కదంతొక్కిన ఛత్తీస్గఢ్ గిరిజనులు
ఏకంగా 300 కిలోమీటర్లు పాదయాత్ర
రాయ్పూర్లో భారీ ధర్నా
రాయ్పూర్ : అడవుల పరిరక్షణకు గిరిజనం కదంతొక్కారు. ఏకంగా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అడవుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ అధికారులకు విన్నవించారు. అడవులను ధ్వంసం చేసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. ఉత్తర ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అరణ్య ప్రాంతంలో గల బొగ్గు గనుల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, ప్రాజెక్టుల లీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 300 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాయ్పూర్ చేరుకున్నారు. హస్దేవ్ అరణ్య ప్రాంత రక్షణకు, గ్రామసభ హక్కులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ పది రోజుల క్రితం ప్రారంభమైన వేలాదిమంది గిరిజనుల పాదయాత్ర నిన్న ఇక్కడికి చేరింది. గురువారం రాయ్పూర్లోని థర్మస్థల్లో భారీ ధర్నా చేపట్టింది. గిరిజనులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.