ఇంధనంపై విధించే పన్నుల్లో 68 శాతం వరకు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటోందని, అయినప్పటికీ ప్రదాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నా, బొగ్గు కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టేస్తోందన్నారు. మోదీ చెప్తున్న సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదని, నిర్బంధమని అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ బుధవారం కొవిడ్-19 పరిస్థితిపై మాట్లాడేందుకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరల గురించి ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఉండాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులో లీటరు పెట్రోలుపై ఎక్సయిజ్ డ్యూటీని రూ.5 చొప్పున, లీటరు డీజిల్పై ఎక్సయిజ్ డ్యూటీని రూ.10 చొప్పున తగ్గించిందని, దీనికి అనుగుణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్ను తగ్గించి, ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేశాయని, మరికొన్ని రాష్ట్రాలు ఈ విధంగా చేయలేదని చెప్పారు.