ప్రతాప్గఢ్ : సమాజ్వాదీ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్, పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో యూపీ మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా), మరో 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని కుంట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రాజాభయ్యా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి గుల్షన్ యాదవ్కు సంబంధించిన పోలింగు ఏజెంటుపై ఆదివారం జరిగిన పోలింగు సందర్భంగా దాడికి పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ప్రతాప్గఢ్ జిల్లా ఎస్పీ సత్పాల్ అంటిల్ తెలిపారు. ఎస్పీ తరపున ఏజెంటుగా ఉన్న రాకేష్ కుమార్ను పోలింగు బూత్ నుంచి బయటకు తీసుకువెళ్లి దాడి చేశారని అదే బూత్లోని వేరే పార్టీకి చెందిన ఏజెంట్ టింకూ సింగ్ తనకు ఫోన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎస్పీ ఏజెంటును అక్కడి నుంచి పంపకపోతే బూత్ను ఆక్రమించుకోవడం సాధ్యం కాదని రాజాభయ్యా తన మద్దతు దారులతో కలసి రాకేష్ను తీసుకెళ్లి కొట్టినట్టు పేర్కొన్నారు. ఈ దాడిలో రాకేష్ తలకు గాయాలయ్యాయని చెప్పారు. ఘటనపై అందిన ఫిర్యాదు ఆధారంగా రఘురాజ్ ప్రతాప్సింగ్ సహా మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.