నోయిడా: కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్తిగా విఫలమయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విమర్శించింది. అదేసమయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై యోగి ప్రయోగించిన అసభ్య పదజాలాన్ని తీవ్రంగా ఖండిరచింది. కరోనా సమయంలో మీరు సమర్ధవంతంగా పనిచేయలేదంటే మీరు చేయలేదని యోగి, కేజ్రీవాల్ పరస్పరం విమర్శలు గుప్పించుకున్న మరుసటి రోజు ఆప్ యూపీ సీఎంపై ఘాటుగా స్పందించింది. ఓ ప్రజాదరణగల, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై యోగి ప్రయోగించిన పదజాలం దారుణంగా ఉందని ఆప్ నేత సంజయ్సింగ్ వ్యాఖ్యానించారు. పెద్ద రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న యోగి అలాంటి పదజాలం ప్రయోగించడం సిగ్గుచేటని ఆగ్రహం వెలిబుచ్చారు. ‘కోవిడ్ను సక్రమంగా ఎదుర్కోలేకపోయారని నేను మాట్లాడుతున్నాను. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు అనేకం చెప్పగలను. ఇది ఆదిత్యనాథ్ పూర్తి వైఫల్యం. యూపీలోని ప్రయాగ్రాజ్, కాన్పూరు, బలియా, ఘజియాపూర్లలో నదీతీరప్రాంతాల్లో కుళ్లిపోయిన అనేక కళేబరాలను మేము చూశాం. ఆ కళేబరాలను పక్షులు, జంతువులు పీక్కు తినడం అందరికీ కనిపించింది. ఈ దృశ్యాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు’ అని సంజయ్ సింగ్ నోయిడాలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తన ఆరోపణలకు సాక్ష్యాలుగా మొదటి, రెండో విడత కరోనా సమయంలో నిస్సహాయులైన ప్రజలు, నది ఒడ్డున పడిఉన్న మృతదేహాల ఫొటోలను ఆయన ప్రదర్శించారు.