వేర్వేరు ప్రమాదాల్లో 11మంది దుర్మరణం
గుజరాత్లో ఐదుగురు, బెంగాల్లో ఆరుగురు మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు
రాయ్గంజ్ / మార్చి : గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. గుజరాత్, మార్బి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ట్రక్కుపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. పశ్చిమ బెంగాల్, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో బస్సు లోయలో పడి ఆరుగురు వలస కార్మికులు ప్రాణాలు వదిలారు. ‘బెంగాల్ రోడ్డు ప్రమాదం బుధవారం రాత్రి పది గంటలప్పుడు జరిగింది. ఆ సమయంలో బస్సులో 20 మంది వరకు వలస కార్మికులు ఉన్నారు. వీరంతా బెంగాల్, జార్ఖండ్లకు చెందిన వారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు వెళుతున్నారు’ అని అక్కడి పోలీసులు తెలిపారు. రాయ్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూపాహర్ వద్ద జాతీయ రహదారి 34 సమీపంలో బస్సు లోయలో పడిరదని, ఆరుగురు చనిపోగా, ఇద్దరు క్షతగాత్రులను రాయ్గంజ్ మెడికల్ కాలేజి, హాస్పిటల్కు తరలించినట్లు వెల్లడిరచారు. ఆచూకిలేని ప్రయాణికుల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో తమ ఇళ్లకు వెళ్లిన వలస కార్మికులంతా రెండు డోసుల వాక్సినేషన్ తర్వాత పనుల్లో చేరేందుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. జార్ఖండ్లో కొందరిని ఎక్కించుకొన్న బస్సు అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్కు చేరుకుందని, పూర్నియా, బీహార్లోని పాట్నా మీదుగా లక్నోకు చేరుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు గుజరాత్లోని మార్బి`మాలియా హైవే సమీపంలో తింబిడి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కుపైకి కారు దూసుకుపోగా అందులోని ఐదుగురు మరణించినట్లు డీఎస్పీ రాధికా భరాయి తెలిపారు. డ్రైవరు కారుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. కారులో ఉన్న ఐదుగురు మార్బి పట్టణం నుంచి మాలియా వెళుతున్నట్లు తెలిసిందని చెప్పారు. ఈ ఘటనపై మార్బి తాలూక పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నారు. మృతులను అహ్మదాబాద్లో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేసే ఆనంద్ షెఖావత్, తారాచంద్ బరాలా, అశోక్ బిలేడా, విజేంద్ర సింగ్, పవన్ మిస్త్రీగా గుర్తించినట్లు చెప్పారు. వీరంతా రాజస్థాన్కు చెందినవారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ రాధిక చెప్పారు.