రాజస్థాన్ సీకర్లోని కాటుశ్యామ్జీ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది.ఆలయంలో సోమవారం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించారు. జాతర సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు ఆలయం గేట్లు తెరవగానే భారీగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జైపూర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్ని పరిశీలిస్తున్నారు.ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళా భక్తులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆలయంలో భక్తుల మృతిపై ప్రధాని నరేంద్రమోదీ కూడా విచారం వ్యక్తం చేశారు.