న్యూదిల్లీ: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. గుడివాడలో క్యాసినో ఘటనను కనకమేడల ప్రస్తావించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం మాట తప్పుతూనే ఉందని ఆరోపించారు. కనకమేడల మాట్లాడుతున్న సమయంలో వైకాపా ఎంపీలు అడ్డుపడటంతో సభాపతి వారిని వారించారు. అనంతరం ఇచ్చిన సమయం అయిపోయిందంటూ మైక్ కట్ చేశారు. అంతకుముందు టీడీపీ ఎంపీ మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాజిక నేపథ్యం ఆధారంగా వ్యాపార, పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. ఇటీవల రాష్ట్రంలోని ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న ప్రముఖ నటుడి సినిమా విడుదలకు ముందు సినిమా టికెట్ల ధరను నియంత్రించే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీంతో మిగతా సినిమాల విడుదలను నిలిపివేశారని తెలిపారు. ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం లేదని టీడీపీ నేత అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్ మాఫియాతో పాటు బెట్టింగ్లు విజృంభిస్తున్నాయని తెలిపారు.