ఆజాద్తో సుదీర్ఘమంతనాలు
న్యూదిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూపీందర్సింగ్ హుడాతో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ గురువారం సమావేశమయ్యారు. పార్టీ పునర్వ్యవస్థీకరణపై రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది. అసంతృప్త(జీ23) నేతలతో సమావేశమైన మరుసటి రోజు హుడాతో రాహుల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమి, భవిష్యత్పై పార్టీని ముందుకు తీసుకెళ్లడంపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలని కాంగ్రెస్ అసంతృప్త నేతలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. రాహుల్తో సమావేశం తర్వాత హరియాణా మాజీ సీఎం హుడా నేరుగా జీ
23 నేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ నివాసానికి వెళ్లి..ఆయనతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు సంబంధించిన నిర్ధిష్ట ప్రతిపాదనలపై హుడా, ఆజాద్ చర్చించినట్లు తెలుస్తోంది. సమిష్ట నాయకత్వం, సమిష్టి నిర్ణయాలు ఉండాలన్న అసంతృప్త నేతల ప్రతిపాదనను హుడా ముందు ఆజాద్ ఉంచినట్లు సమాచారం. ఆజాద్ నివాసంలో హుడాతో జరిగిన చర్చల్లో మరో అసంతృప్త నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు ఆనందశర్మ కూడా పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాలతోనే కాంగ్రెస్ పార్టీని పటిష్టవంతం చేసుకోవడం సాధ్యమని జీ23 నేతలు పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ను పటిష్టవంతం చేయాలనే జీ
23 నేతలు కోరుకుంటున్నట్లు అసమ్మతి వర్గాలు వెల్లడిరచాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తమను తక్కువ చేసి చూడటం మంచిది కాదని స్పష్టంచేసినట్లు పేర్కొన్నాయి. అసమ్మతి నేతల బృందం తరపున సోనియాగాంధీతో ఆజాద్ త్వరలోనే సమావేశం కానున్నట్లు తెలిపాయి.