సీనియర్ నేత వేణుగోపాల్కు గాయాలు
ఇండోర్ లో కొనసాగుతున్న రాహుల్ యాత్ర
తొక్కిసలాటలో పలువురికి గాయాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భారీగా వచ్చిన జనాలను పోలీసులు నియంత్రించలేకపోయారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు పలువురు గాయపడ్డారు. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీపై కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఓర్చుకోలేకపోతోందని…. తమ యాత్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.