న్యూదిల్లీ : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 తేలికపాటి హెలికాప్టర్లు సహా రూ.7,965 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతం సైనిక పరికరాల కొనుగోలు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సాగిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో 12 హెలికాప్టర్ల కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టు తెలిపింది. దీంతో పాటు నౌకాదళంలో వినియోగించే యుద్ధనౌకల వాడకం, ట్రాకింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచేలా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి లింక్స్ యూ2 నావల్ గన్ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కొనుగోలుకు, సముద్ర, తీరప్రాంత నిఘా కోసం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా డోర్నియర్ విమానాల మిడ్-లైఫ్ అప్గ్రేడేషన్కు ఆమోదం లభించినట్టు వెల్లడిరచింది. ఆత్మనిర్భర్ భారత్ పథకానికి ప్రోత్సాహకరంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న అప్గ్రేడ్ చేసిన సూపర్ రాపిడ్ తుపాకులు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. తాజాగా కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ ప్రతిపాదనలన్నీ ‘మేక్ ఇన్ ఇండియా’ కింద దేశంలో తయారవుతున్నవేనని పేర్కొంది.