రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూదిల్లీ : మిలిటరీ, పౌర సంస్థలకు రెండు విధాల ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరముందని భాతర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆందోళనలు, వివిధ దేశాల మధ్య సరిహద్దు, సముద్ర జలాల వివాదాల నేపథ్యంలో సైనిక పరికరాలకు డిమాండు పెరుగుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ ఆవకాశాలను అందిపుచ్చుకోవడానికి అత్యాధునిక రక్షణ పరికరాలు తయారీ, పరిశోధన, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. వ్యూహాత్మక వ్యవహారాలు, సైనిక శక్తి, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనికేషన్ రంగాలలో వస్తున్న మార్పులతో రెండు విధాలుగా ఉపయోడపడే సాంకేతికతలను రూపొందించాలని కోరారు. ప్రస్తుతం రక్షణ రంగం అవసరాల కోసం, పరికరాల తయారికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించి ఆ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. భద్రతా బలగాలకు, పౌర సంస్థలకు రెండు విధాల ఉపయోగపడే సాంకేతికత అందుబాటులోకి వస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపారు. తద్వారా దేశ భద్రతా అవసరాలను తీర్చడమే కాకుండా విదేశాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. దీంతో పాటు నానో టెక్నాలజీ, క్వాంటం కంప్యూటరింగ్, రోబోటిక్ టెక్నాలజీ వంటి భవిష్యత్ సాంకేతికతల అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు.