న్యూదిల్లీ: రెస్టారెంట్లు జారీచేసే ఆహార బిల్లులో సేవా రుసుము (సర్వీస్ చార్జ్)ను పేర్కొనడానికి వీల్లేదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే రెస్టారెంట్లకు వచ్చే వారు ఇష్టానుసారం విడిగా టిప్స్ ఇవ్వవచ్చని మంత్రి పేర్కొన్నారు. రెస్టారెంట్ యజమానులు తమ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు చెల్లించాలనుకుంటే, ధరల నియంత్రణలు లేనందున వారు తాము సరఫరా చేసే ఫుడ్ మెనూలో రేట్లను పెంచుకోవచ్చునని గోయల్ చెప్పారు. రెస్టారెంట్ల సర్వీస్ చార్జీల అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా గోయల్ ఈ విధంగా స్పందించారు. సర్వీస్ చార్జీని రద్దు చేస్తే తమకు నష్టం వస్తుందన్న రెస్టారెంట్ యజమానుల వాదనలను ఆయన తోసిపుచ్చారు. రెస్టారెంట్లు… వినియోగదారులపై సర్వీస్ చార్జి విధించకుండా నిరోధించడానికి ప్రభుత్వం త్వరలో చట్టబద్ధ ప్రణాళికతో ముందుకు వస్తుందని గురువారం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రెస్టారెంట్లు సర్వీస్ చార్జీలు విధించడంపై వినియోగదారుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు వేతనాల పెంపుదల, రేట్లు పెంచడం రెస్టారెంట్ల యజమానులకున్న స్వేచ్ఛ అని, వెల్లడిరచని ఖర్చు ఉంటే అసలు ధర ప్రజలకు ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. సేవలపై ప్రజలు సంతృప్తి చెందితే టిప్లు వదిలివెళతారని, వారు అలా కొనసాగించవచ్చని గోయల్ వివరించారు. గురువారం వినియోగదారుల వ్యవహారాల శాఖ రెస్టారెంట్లు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. అనంతరం వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ… సర్వీస్ చార్జీలు విధించడం వల్ల వినియోగదారుల హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడిరదని అన్నారు. ఇది ‘అన్యాయమైన వాణిజ్య పద్ధతి’ అని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో త్వరలోనే చట్టపరమైన ప్రణాళికతో ముందుకొస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్లో వినియోగదారులు లేవనెత్తిన ప్రధాన సమస్యలపై చర్చించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.