న్యూదిల్లీ : తమ హక్కులు,ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న రైతులు, కార్మికులు, విద్యార్థులకు మద్దతుగా నిలిచే భారతదేశానికి తాను అండగా నిలుస్తానని, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన స్నేహితుల కోసమే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రైతులు రద్దు చేయాలని కోరుతున్న నూతన వ్యవసాయ చట్టాలను వారిపై రుద్దడం ద్వారా వారి హక్కులను మోదీ సర్కారు కబళిస్తోందని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెబుతున్నాయి. ‘మోదీ ప్రభుత్వం స్నేహితుల కోసమే ఉంది.. కానీ, దేశం యావత్తు హక్కులు, ఆత్మగౌరవం కోసం ‘సత్యాగ్రహం’ చేస్తున్న రైతులు-కార్మికులు-విద్యార్థులతో ఉంది.. నేను ఎల్లప్పుడూ దేశంతో ఉంటాను’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.