న్యూదిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనల సమయంలో పోలీసు చర్య వల్ల ఒక్క రైతు కూడా మరణించలేదని కేంద్రం శుక్రవారం తెలిపింది. రాజ్యసభలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, ‘రైతు ఉద్యమంలో సమయం మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం తదితర అంశాలు రాష్ట్రాలకు సంబంధించినవి’ అని తెలిపారు. రైతుల ఆందోళన సమయంలో పోలీసుల చర్య వల్ల ఏ రైతు చనిపోలేదని అన్నారు. కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ కలిసి అడిగిన ప్రశ్నకు తోమర్ సమాధానం ఇచ్చారు. రైతుల నిరసనల సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వం ఆర్థిక పరిహారం అందిస్తుందా లేదా అటువంటి ప్రణాళిక చేస్తుందా అని సభ్యులు ప్రశ్నించారు. ఏడాదిగా సాగుతున్న నిరసనల్లో రైతుల మరణాల అంశాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తుతున్నాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై అడిగిన మరొక ప్రశ్నకు తోమర్ సమాధానం ఇస్తూ, ‘జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, దేశం మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంటల విధానాన్ని మార్చడానికి, ఎంఎస్పీని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా చేయడానికి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేసే విషయం పరిశీలనలో ఉంది’ అని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా ప్రతి పంటకు ఎంఎస్పీకి చట్టపరమైన హామీనిచ్చేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా అని అడిగిన ప్రశ్నకు, పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభానికి ఎంఎస్పీని అమలు చేయాలన్న రైతులపై జాతీయ కమిషన్ (ఎన్సీఎఫ్) చేసిన సిఫారసులను ప్రభుత్వం 2018-19లో ఇప్పటికే అమలు చేసిందని మంత్రి తెలిపారు.