గడ్కరీకి ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా చెట్లతో అందంగా ఉన్న ఓ రోడ్డుకు సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్న రోడ్లకు ఇరువైపులా ఇదే విధంగా చెట్లను పెంచాలని కోరారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలోని రోడ్డు చాలా అందంగా కనిపిస్తోంది. ఓ రహదారి, దానికి ఇరువైపులా పొడవాటి కెనోపీ చెట్లతో చూడ్డానికి ప్రకృతి నిండుదనం సంతరించుకున్నట్టుగా కనిపిస్తోంది. మనం సొరంగ మార్గంలో ప్రయాణించినప్పుడు ఎలా అనిపిస్తుందో.. ఈ చెట్ల కింద నుంచి రోడ్డుపై వెళుతున్నా అదే అనూభూతి కలుగుతుంది. చెట్లు, సొరంగం కలిపి ఉన్నాయనే అర్థంలో దీనికి ట్రన్నెల్ అని పేరు పెట్టారు. సొరంగాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన ఇచ్చిన ట్వీట్లో తెలిపారు. ఇలాంటి ట్రన్నెల్లో ప్రయాణించడానికి తాను ప్రాధాన్యమిస్తానని చెప్పారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. కొత్తగా నిర్మించే గ్రామీణ రోడ్ల మీద ఇలాంటి ట్రన్నెల్స్ నిర్మాణానికి ప్రణాళిక రచించగలమా గడ్కరీ గారూ? అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓ యూజర్ ఇచ్చిన ట్వీట్లో, కొల్హాపూర్, కొంకణ్ మధ్యలో ఉన్న రాధానగరి అటవీ ప్రాంతం ఈ విధంగానే ఉంటుందన్నారు.