లక్నో : రాష్ట్ర రాజధానిలో రెండు జికా వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 111కి చేరింది. వైరస్ నమోదులో లక్నో మూడో జిల్లాగా ఉంది. అంతకుముందు కాన్పూర్, కన్నౌజ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. వీటిలో 108 కేసులు కాన్పూర్లో నమోదవగా, 1 కేసు కన్నౌజ్లో నమోదైంది. ఈ కేసుల్లో కాన్పూరులో 17మంది కోలుకున్నారు. వీరిలో లక్నోలోని హుస్సేన్గంజ్కు చెందిన 30 సంవత్సరాల వ్యక్తి, కృష్ణనగర్కు చెందిన 24 సంవత్సరాల యువతి ఐసోలేషన్లో ఉండగా, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. పరీక్షల కోసం వారి నమూనాలను సేకరించారు. అలాగే వీరితో చనువుగా ఉన్న వారి నుంచి కూడా నమూనాలు సేకరించారు. వీరు ఉంటున్న ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ`లార్వా స్ప్రే చల్లించారు. వ్యాధి తీవ్రతను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ ఆదేశించారు.