న్యూదిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై దసరా పండగ ముందు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం..యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. లఖింపూర్ ఖేరి ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్కు చెందిన శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు. వారి అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ నెల 8వ తేదీని విచారణ జరిపింది. లఖింపూర్ హింసకు కారణమైన నిందితుల పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. దయచేసి విచారణకు హాజరుకండి అంటూ నిందితుడికి సీఆర్పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మండిపడిరది. ఇతర కేసుల్లో నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? అంటూ నిలదీసింది. యూపీ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవని దుయ్యబట్టింది. తదుపరి విచారణను అక్టోబరు 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటనపై మరో ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలా లేదా అన్నదానిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది.