న్యూదిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనలో సాక్షులకు తగిన రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటనకు కీలక బాధ్యుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన ముగ్గురు అన్నదాతల కుటుంబ సభ్యులు కీలక నిందితుడైన ఆశిశ్ మిశ్రాకు ఫిబ్రవరి 10న అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీంలో సవాలు చేశారు. హైకోర్టు తీర్పు చాలా అన్యాయమైందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడం లేదని వాపోయారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో ఓ సాక్షిపై జరిగిన దాడిని తాము గుర్తిస్తున్నామని పేర్కొంది. ఇతర సాక్షులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని సూచించింది. బెయిలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై స్పందన తెలపాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.