పాట్నా: ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ కుటుంబంలో వైరుధ్యాలు మరోసారి తెరపైకి వచ్చాయి. లాలు పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మంగళవారం రాత్రి తల్లి రబ్రీదేవి నివాసానికి వచ్చారు. రాత్రంతా ఆయన అక్కడే ఉన్నారు. తేజ్ ప్రతాప్కు ప్రభుత్వం బంగళా కేటాయించినప్పటికీ ఆయన అందులో నివసించడం లేదు. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ శాసనసభ్యుడిగా ఉన్నారు. తన రాజీనామాను తండ్రికి పంపుతానని సోమవారమే ఆయన ప్రకటించారు. లాలు చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ పార్టీ పగ్గాలు చేపట్టడం, పార్టీ కార్యకలాపాలన్నీ తానే నిర్వహించడం, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండటం వంటి అనేక అంశాలను తేజ్ప్రతాప్ భరించలేకపోతున్నారు. పార్టీలో ఆధిపత్యం కోసం ఇప్పటికే అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. తేజస్వి యాదవ్ను లాలు నిర్మొహమాటంటా తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. తేజ్ ప్రతాప్ మాత్రం తల్లిచాటు బిడ్డగా ప్రతిసారి రబ్రీదేవి మద్దతు కోరుతున్నారు. ఆర్జేడీ కిందిస్థాయి నాయకత్వం సైతం పెద్దగా లెక్కలోకి తీసుకోకపోవడం తేజ్ప్రతాప్కు ఆగ్రహం తెప్పిస్తుంది. వాస్తవంగా తేజ్ప్రతాప్ నిలకడైన రాజకీయ నేత కాదు. ఆయనలో తెంపరితనం ఎక్కువ. పార్టీ నాయకులు, కార్యకర్తలపైనా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇది తేజస్వి యాదవ్కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. అన్నకు చెప్పలేక..పార్టీ నాయకులు, కార్యకర్తలను సమర్థించలేక అవస్థలు పడుతుంటారు. తేజ్ప్రతాప్ దుడుకు స్వభావం గల నాయకుడని, చంపేస్తానంటూ బెదిరిస్తాడని ఆర్జేడీ యువజన విభాగం నాయకుడు రామ్రాజ్ యాదవ్ చెప్పారు. తేజ్ప్రతాప్ తల్లి రబ్రీదేవి నివాసంలోనే ఉంటున్నారు. గతవారం రబ్రీ ఇంటిలో తేజస్వి యాదవ్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. అప్పుడు కూడా తేజ్ప్రతాప్ దురుసుగా ప్రవర్తించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రామ్రాజ్ ఆరోపణల నేపథ్యంలో తేజ్ప్రతాప్ ఇక నుంచి రబ్రీదేవి ఇంటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.