బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అనేక సంవత్సరాల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి తన మూత్రపిండం (కిడ్నీ)ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన త్వరలో సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకోబోతున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రోహిణి ఆచార్య సింగపూర్లో ఉంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకోవాలని ఆయనకు సింగపూర్ వైద్యులు సూచించారు. దీంతో ఆమె తన మూత్రపిండాల్లో ఒకదానిని తన తండ్రికి దానం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే లాలూ మొదట్లో ఈ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలుస్తోంది. తన ప్రాణాలను కాపాడటానికి రోహిణి మూత్రపిండాన్ని దానం చేయడం సరికాదని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులు మూత్రపిండాన్ని ఇచ్చినపుడు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతమవుతున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయని, అందువల్ల తన మూత్రపిండాన్ని తీసుకోవడానికి అంగీకరించాలని రోహిణి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఆమె ఒత్తిడితో ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నవంబరు 20-24 మధ్యలో ఏదో ఓ రోజు లాలూ సింగపూర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రోహిణి ఒత్తిడితోనే ఆయన సింగపూర్ వైద్యులను సంప్రదించారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఢల్లీిలోని ఎయిమ్స్లో మూత్రపిండాల సమస్యకు చికిత్స చేయించుకుంటున్నారు. కానీ ఎయిమ్స్ వైద్యులు ఆయనకు మూత్రపిండాలను మార్చుకోవాలని సలహా ఇవ్వలేదు.