డెహ్రాడూన్: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందానికి చెందిన వాహనం ప్రమాదానికి గురై లోయలో పడిపోవడంతో 14మంది మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని చాంపావత్ జిల్లా, సుఖీదాంగ్`దండమినార్ రోడ్డుపై జరగ్గా వాహనం లోతైన సన్నగా ఉన్న లోయలో పడిపోయిందని మంగళవారం పోలీసులు తెలిపారు. ప్రమాదం సోమవారం సుమారు రాత్రి 10 గంటలకు చోటుచేసుకోగా, అధికారులకు తెల్లవారుజామున 3 గంటలకు సమాచారం అందింది. వెంటనే జిల్లా విపత్తుల నిర్వహణా బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేసింది. చాంపావత్ ఎస్పీ దేవేంద్ర పింఛా మీడియాతో మాట్లాడుతూ 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన రెండు మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లోయ మార్గం సన్నగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. గాయపడ్డ వారికి చంపావత్, తనకపర్ జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. మిగిలిన మృతదేహాలను బయటకు తీసే చర్యలు కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు. ధర్మశాలలోని తనపూర్లో పెళ్లికి హాజరైన ఓ బృందాన్ని వాహనం తీసుకొస్తుండగా, దండకాక్నాయ్ గ్రామంలో ప్రమదాం జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.