న్యూదిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. కేవలం పది నిమిషాల తేడాతో వంద శాతం ప్రొడక్టివిటీని రాజ్యసభ చేరుకోలేకపోయింది. 99.80శాతం పనిచేసింది. 2017 వర్షాకాల సమావేశాల తర్వాత 14 సమావేశాలు పూర్తిస్థాయిలో జరగడం ఇది మూడవసారి అని రాజ్యసభ అధికారులు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 29 సమావేశాలు జరగాల్సి ఉండగా 27 మాత్రమే జరిగాయని, బడ్జెట్ సమావేశాల తొలి భాగంలో 10, రెండవ భాగంలో 17 సమావేశాలు జరిగాయన్నారు. సభలో వేర్వేరు పార్టీల నేతల కోరిక మేరకు హోలీ, రామనవమీ సందర్భంగా రెండు సిట్టింగులు రద్దు చేశారు. తాజా బడ్జెట్ సమావేశం సానుకూలంగా మొదలైందని, ఎలాంటి అవంతరాలు, వాయిదాలు లేకుండా 12 సిట్టింగులు జరిగాయని, మూడేళ్లలో సభ అద్భుతంగా పనిచేయడం ఇదేనని రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటన పేర్కొంది. 11 బిల్లులను ఎగువ సభ ఆమోదించగా ఇందులో తిరిగొచ్చిన ఆరు ద్రవ్య వినియోగ, ఆర్థిక బిల్లులు ఉన్నాయి. మారణాయుధాలు, వాటి సరఫరా వ్యవస్థలు (చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ) సవరణ బిల్లు, 2022ను గురువారం సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాలు రెండవ దశలో ఆరు రోజులు వాయిదాలు కొనసాగాయి. 11 రోజుల్లో షెడ్యూల్ సమాయానికి కంటే ఎక్కువగా సభ్యులు పనిచేశారు. మొత్తంగా 27 సమావేశాలు జరుగగా ఇందులో 21 సమావేశాలు వాయిదాలు లేకుండా సాగాయి. షెడ్యూల్డ్ సమయం 127గంటల 57 నిమిషాలు కాగా సభ 127 గంటల 44 నిమిషాలు పనిచేసిందని అధికారులు చెప్పారు. పది నిమిషాల తేడాతో 100 శాతం ప్రొడక్టివిటీని చేరుకోలేపోయినట్లు వెల్లడిరచారు. సభలో గందరగోళం, వాయిదాల కారణంగా తొమ్మిది గంటల 26 నిమిషాలు వృథా కాగా సభ్యులు అదనపు గంటలు పనిచేయడంతో తొమ్మిది గంటల 16 నిమిషాలు కలిసివచ్చినట్లు చెప్పారు. రైల్వే, ఈశాన్య ప్రాంతాభివృద్ధి, గిరిజనుల వ్యవహారాలు, కార్మికుల మంత్రిత్వశాఖలపై సభ్యులు 22 గంటల 24 నిమిషాలు చర్చలు జరిపారు. 12 ఏళ్లలో సభ ఇంత అద్భుతంగా పనిచేయడం ఇదే మొదటిసారి. 2010లో కేవలం ఐదు మంత్రిత్వశాఖలపైనే చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. నిర్దేశిత పనివేళల్లో 37శాతం రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞత తీర్మానంపై, 2022`23 కేంద్ర బడ్జెట్, నాలుగు మంత్రిత్వశాఖల పనితీరుపై చర్చలకు వెచ్చించారు. నిర్దేశిత సమయంలో 23శాతం ప్రభుత్వ బిల్లులపై చర్చకు వినియోగం కాగా 10శాతం జిరో అవర్లో ప్రజా ప్రయోజన అంశాలపై చర్చలకు వినియోగమైంది. మొత్తం 360లో నుంచి 37.50శాతం అంటే 135 స్టార్డ్ ప్రశ్నలపై మౌఖిక సమాధానాలు ఇవ్వబడినట్లు అధికారులు చెప్పారు. సభ్యుల సగటు హాజరీ 50.10శాతం కాగా హోం వ్యవహారాలు, విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిటీలవి 60శాతానికిపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 16 సమావేశాలు గంటా 13 నిమిషాలు సాగాయన్నారు. ఆయా కమిటీలు 36 నివేదికలు సమర్పించినట్లు చెప్పారు. వీటిలో 30 వేర్వేరు మంత్రిత్వశాఖలు, విభాగాల నిధి కేటాయింపులకు సంబంధించినవిగా తెలిపారు. గతేడాది బడ్జెట్ సమావేశాలతో పోల్చితే ఈసారి సమావేశాలు 94శాతం మెరుగా సాగినట్లు రాజ్యసభ అధికారులు తెలిపారు. చివరి రోజు కొందరు సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేసిన క్రమంలో సంప్రదాయం ప్రకారం వందన సమర్పణను చైర్మన్ వెంకయ్య నాయుడు చేయలేదు.