రూ.317 కోట్లు వడ్డీతో సహా డిపాజిట్ చేయాలని సుప్రీం ఆదేశం
బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించింది. 4 నెలలు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. అలాగే రూ. 2 వేల జరిమానా విధించింది. కోర్టు తీర్పు ధిక్కారానికి గానూ సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వడ్డీతో కలిపి నాలుగు వారాలలోగా 40 మిలియన్ డాలర్లు డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పును వెలువరించింది. అయితే విజయ్ మాల్యా ఇలా చేయలేదు. అలాగే సంబంధిత ప్రభుత్వ విభాగాలు మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 2020లో సుప్రీం కోర్టు విజయ్ మాల్యా రిక్వెస్ట్ను తోసిపుచ్చింది. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల బదిలీ చేసినందుకు 2017 ధిక్కార నేరాన్ని పునఃపరిశీలించాలన్న మాల్యా అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 2016 మార్చి నుంచి విజయ్ మాల్యా యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తూ ఉన్నారు. 2017 ఏప్రిల్ 18న స్కాట్లాండ్ యార్డ్ ఈయనపై ఎక్స్ట్రడిక్షన్ వారెంట్ జారీ చేసింది. అయితే దీనిపై ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. కాగా విజయ్ మాల్యా బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే. కింగ్ ఫిషన్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్న రుణాలను చెల్లించకుండా దేశం విడిచి పారిపోయారు. బ్యాంకుల కన్సార్షియానికి సారథ్యం వహిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాల్యా తీసుకున్న రుణాలు చెల్లించడంలో కోర్టు ఆదేశాలను అనుసరించడం లేదని సుప్రీం కోర్టుకు వెళ్లింది. అంతేకాకుండా విజయ్ మాల్యా ఆయన ఆస్తులను వెల్లడిరచకుండా.. వాటిని పిల్లల పేరుపైకి బదిలీ చేశారు.