శ్రీనగర్ : జమ్ముకశ్మీరులో ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన ఎన్కౌంటరులో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా శుక్రవారం నాటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ టెర్రరిస్టులు మృతిచెందారు. ఈ ఎన్కౌంటరులో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జెవాన్ ప్రాంతంలో డిసెంబరు 13న జరిగిన ఎన్కౌంటరులో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకడు ఈ ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్ శివారులోని పాంథా చౌక్ ప్రాంతంలో ఎన్కౌంటరు జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు జరుపుతుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని, భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయని పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారని పోలీసు అధికారు ఒకరు తెలిపారు. గాయపడిన వారిని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఎన్కౌంటరులో జైషే మహ్మద్ ఉగ్రవాదులు ముగ్గురు చనిపోయినట్లు కశ్మీరు ఐజీ విజయ్కుమార్ చెప్పారు.