ముంబైలోని పాత్రాచాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. 60 ఏళ్ల సంజయ్ రౌత్ను ఆగస్టు 1న ఈడీ అరెస్టు చేసింది. సోమవారంతో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పూర్తవుతుండటంతో కోర్టు ముందు ఆయనను అధికారులు హాజరు పరచారు. కోర్టు మరో రెండు వారాలు జ్యుడిషయల్ కస్టడీ పొడిగించింది. పాత్రా చాల్ పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని, రౌత్ భార్య వర్షారౌత్, తదితరుల ప్రమేయం ఇందులో ఉందని ఈడీ అభియోగం. అయితే, ఎలాంటి అవకతవకలకు తాము పాల్పడలేదని, ఈడీ తప్పుడు కేసు బనాయించిందని సంజయ్ రౌత్ తెలిపారు. ఇప్పటికే వర్షారౌత్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. రౌత్ సన్నిహితుడుగా చెబుతున్న గురు ఆశిష్ కన్స్ట్రక్షన్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్ రౌత్ను కూడా ఈడీ అరెస్టు చేసింది.