తిప్పికొడుతున్న విధేయులు
న్యూదిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తర్వాత కూడా కాంగ్రెస్పార్టీలో నాయకత్వం అంశంపై అంతర్గత పోరు ఆగడం లేదు. పార్టీ అధినాకత్వంపై సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ మంగళవారం సిబాల్పై మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ భాషలో కపిల్ సిబాల్ మాట్లాడుతున్నారంటూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ విధేయుడుగా ఠాగూర్కు పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీ కుటుంబీకులను తప్పించాలని బీజేపీ కోరుకుంటోందని, కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి, ఐడియా ఆఫ్ ఇండియాను ధ్వంసం చేయడమే వారి ఉద్దేశమని ఠాగూర్ ఘాటు విమర్శలు చేశారు. కపిల్ సిబాల్కు కూడా ఈ విషయం బాగా తెలుసునని, కానీ ఆయన కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ భాషలో ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.
కపిల్ సిబల్ ఏమన్నారంటే…
కపిల్ సిబల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ నాయకత్వం నుంచి గాంధీజీలు తప్పుకుని, పార్టీని నడిపే బాధ్యతను ఇతర నేతలకు అప్పగించాలని పేర్కొన్నారు. ‘సబ్ కీ కాంగ్రెస్’ను తాను కోరుకుంటున్నానని, ‘ఘర్ కీ కాంగ్రెస్’ను కాదని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబీకులు వెంటనే తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని సూటిగా డిమాండ్ చేశారు. గాంధేయ కుటుంబం లేకుండా పార్టీ మనుగడే కష్టమని కొందరు అంటున్నారని, కాంగ్రెస్ అందరి పార్టీ అని, ఒక కుటుంబ పార్టీ కాదని కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం ఐదు గంటల సేపు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కపిల్ సిబాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలలో సోనియా కొనసాగాలని, పార్టీ పటిష్ఠతకు అవసరమైన మార్పులు వెంటనే చేపట్టాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.