న్యూదిల్లీ : 12వ తరగతిలో మార్కుల మెరుగుదల కోసం ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయిన కొంతమంది విద్యార్థులు తమ అసలు ఫలితాలను కొనసాగించేందుకు బోర్డుకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని డిసెంబర్ 6న విచారణకు చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు సోమవారం తెలిపింది. 30:30:40 మూల్యాంకన విధానం ఆధారంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అసలు ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది విద్యార్థులు ఈ అభ్యర్ధనను దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టు`సెప్టెంబర్లో జరిగిన మార్కుల మెరుగుదల పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించబడ్డారు. మార్కుల మెరుగుదల పరీక్షలలో ఆ విద్యార్థులు ఫెయిల్గా ప్రకటించటం లేదా చాలా తక్కువ మార్కులు పొందారని ఆ పిటిషన్ పేర్కొంది. 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారి అసలు ఫలితాలు రద్దు చేయబడతాయని వారు భయపడుతున్నారని వివరించింది. ఈ విషయం న్యాయమూర్తులు ఎం.ఎం.ఖాన్విల్కర్, సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు సీబీఎస్ఈ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆదివారం తనకు పిటిషన్ కాపీ అందిందని, సూచనలను పొందడానికి కొంత సమయం కావాలని అన్నారు. దీనిపై ధర్మాసనం డిసెంబర్ 6కు విచారణను వాయిదా వేసింది. కాగా న్యాయవాది రవి ప్రకాష్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్, మూల్యాంకన విధానం ఆధారంగా అసలు ఫలితాల్లో ఇప్పటికే ఉత్తీర్ణత సాధించిన 12వ తరగతి విద్యార్థులను ఫెయిల్గా ప్రకటించవద్దని సీబీఎస్ఈని ఆదేశించాలని, ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫలితాలకు బదులుగా పిటిషనర్ల అసలు ఫలితాన్ని కొనసాగించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరింది.