సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్డు, 2021కు ఎంపికయ్యారు. ఈ ఏడాది పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్లు లోకమాన్య తిలక్ ట్రస్టు అధ్యక్షుడు దీపక్ తిలక్ ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు కొవిషీల్డ్ ఉత్పత్తిలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారంతో సత్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 13న జరిగే కార్యక్రమంలో డాక్టర్ పూనావాలాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ పురస్కారంతోపాటు రూ.1 లక్ష నగదు, ఓ మెమెంటో ప్రదానం చేస్తామన్నారు. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ప్రతి సంవత్సరం లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1న ఇస్తూ ఉంటామని, ఈసారి కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి, ఆగస్టు 13న నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పురస్కారాన్ని బహూకరించడం 1983 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు.