Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సుధా భరద్వాజ్‌కు బెయిల్‌ మంజూరుపై ఎన్‌ఐఏ వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సుప్రీం


న్యూదిల్లీ : ఎల్గార్‌ పరిషద్‌మావోయిస్టులతో సంబంధాల కేసులో న్యాయవాది, కార్యకర్త సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎన్‌ఐఏ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. ‘హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు’ అని తెలిపింది. అంతకుముందు, ఎన్‌ఐఏ డిసెంబర్‌ 1న హైకోర్టు ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు(నిరోధక) చట్టం నిబంధనల కింద 2018, ఆగస్టులో ఎల్గార్‌ పరిషద్‌మావోయిస్టులతో సంబంధాల కేసులో భరద్వాజ్‌ అరెస్ట్‌ అయ్యారు. కాగా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె బెయిల్‌కు అర్హురాలని, దానిని తిరస్కరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద హామీ ఇవ్వబడిన జీవించే ప్రాథమిక హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. బైకుల్లా మహిళా జైలులో ఉన్న భరద్వాజ్‌ను డిసెంబర్‌ 8న ముంబై ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ముందు హాజరుపరచాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆమె బెయిల్‌ షరతులు, విడుదల తేదీ నిర్ణయించబడతాయని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన 16 మంది కార్యకర్తలు, విద్యావేత్తలలో డిఫాల్ట్‌ బెయిల్‌ పొందిన వారిలో భరద్వాజ్‌ మొదటి వ్యక్తి. కవి, కార్యకర్త వరవరరావు ప్రస్తుతం మెడికల్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక మత బోధకుడు స్టాన్‌ స్వామి మెడికల్‌ బెయిల్‌ కోసం ఎదురుచూస్తూ ఈ ఏడాది జులై 5న ఇక్కడి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. ఇతరులు విచారణ ఖైదీలుగా కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసులో ఎనిమిది ఇతర సహ నిందితులుగా ఉన్న సుధీర్‌ ధావలే, వరవరరావు, రోనా విల్సన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, షోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, వెర్నాన్‌ గోన్సాల్వేస్‌, అరుణా ఫెరీరా దాఖలు చేసిన డిఫాల్ట్‌ బెయిల్‌ వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. డిసెంబరు 31, 2017న పూణేలోని శనివార్వాడలో జరిగిన ఎల్గార్‌ పరిషత్‌ సమ్మేళనంలో ఉద్రేకపూరిత ప్రసంగాలకు సంబంధించి ఆరోపణలు, మరుసటి రోజు నగర శివార్లలో ఉన్న కోరేగావ్‌-భీమా యుద్ధ స్మారకం సమీపంలో హింసను ప్రేరేపించారని, ఈ సమ్మేళనానికి మావోయిస్టుల మద్దతు ఉందని పూణె పోలీసులు ప్రకటించారు. అనంతరం ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img