తాలిబన్ మైండ్సెట్ అంటున్న శివసేన
న్యూదిల్లీ : ప్రముఖ నటుడు సోనూసూద్ ఆస్తులపై ఆదాయపన్నుశాఖ దృష్టిసారించింది. నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సామాజిక సేవలు అగ్రభాగాన నిలిచిన సోనూసూద్ ఆస్తులపై ఐటీ అధికారులు కన్నేశారు. సోనూసూద్ కార్యాలయాల్లో బుధవారం విస్తృత తనిఖీలు చేసిన ఐటీ అధికారులు గురువారం ముబైలోని జూహూలో గల ఆయన ఇంటిపైనా దాడులు చేశారు. లక్నో కేంద్రంగా గల ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో చేసుకున్న ప్రాపర్టీ డీల్పై ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోనూసూద్ కరోనా మహమ్మారి వేళ బాధితులకు అండగా నిలవడమే కాకుండా ఇటీవల దిల్లీలో ఆప్ ప్రభుత్వానికి చేయూత అందించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై సోనూసూద్ నివాసంలో తనిఖీలు చేసినట్లు ఐటీ అధికారులు చెప్పారు. కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి సోనూసూద్ బాధితులకు అండగా నిలిచారు. ప్రత్యేకించి వలస కూలీలకు ఆపద్బాంధవుడయ్యారు. ఆయన పెద్దఎత్తున సహాయం చేయడం మోదీ సర్కారుకు ఏ మాత్రం నచ్చినట్లు కనిపించడం లేదు. దీంతో ఐటీ దాడులకు పురికొల్పింది. ప్రత్యేకించి పాఠశాల విద్యార్థుల కోసం దేశ్కా మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా దిల్లీ ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత సర్వే పేరుతో సోనూసూద్ కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు, సోనూసూద్ కార్యాలయాలు, నివాసాలపై ఐటీ దాడులను రాజకీయ పార్టీలు నిశితంగా విమర్శించాయి. తాలిబన్ మైండ్సెట్తో మోదీ సర్కారు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని శివసేన మండిపడిరది. చారిటీ ద్వారా సోనూసూద్ ప్రజలకు సేవ చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై కక్షసాధింపు చర్యలేమిటని నిలదీసింది. వాస్తవంగా తన చారిటీకి ఎలాంటి రాజకీయాలు లేవని సోనూసూద్ ఇప్పటికే అనేకసార్లు ప్రకటించారు.