నిలిచిన లావాదేవీలు
న్యూదిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో ఉద్యోగులు సోమవారం విధులకు హాజరు కాలేదు. బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. బ్యాంకు సేవలపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడిరది. కొత్తతరం ప్రైవేట్రంగ బ్యాంకులు పాక్షికంగా పనిచేశాయి. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల లావాదేవీలు నిలిచిపోయాయి. అంతేకాకుండా చెక్కుల క్లియరెన్స్, ప్రభుత్వ ట్రెజరీల కార్యకలాపాలపైనా సమ్మె ప్రభావం కనిపించింది. తూర్పు భారతదేశంలోని బ్యాంకులపై సమ్మె ప్రభావం ఎక్కువుగా ఉందని, ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం చెప్పారు. ఇతర ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచీలు తెరిచి ఉన్నాయని, అధికారులు మాత్రమే విధులకు హాజరయ్యారని వెల్లడిరచారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయన్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై బ్యాంకు యూనియన్లు ఆగ్రహంతో ఉన్నాయి. డిపాజిట్లపై వడ్డీ పెంచాలని, సర్వీసు చార్జీలు తగ్గించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏఐబీఈఏతో పాటు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీఓఏ) రెండు రోజుల సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికచట్టాల్లో ప్రతిపాదిత మార్పులు రద్దు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ సహా పది కేంద్ర కార్మిక సంఘాలు రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వేతన కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సహా అత్యధిక బ్యాంకులు సమ్మెకు మద్దతుగా నిలిచాయి.