న్యూదిల్లీ: భారత్ను స్వయం సమృద్ధిగల దేశంగా తీర్చిదిద్దడంలో సహకార రంగం పాత్ర కీలకమని కేంద్ర సహకారశాఖమంత్రి అమిత్షా చెప్పారు. దేశంలో 709 కోట్లమంది పేదలకు సహకారం రంగం చేయూత అందిస్తోందని తెలిపారు. 70కోట్లమంది పేదలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు సహకార బ్యాంకులు తోడ్పాటు అందించాలని కేంద్ర హోంమంత్రి కూడా అయిన అమిత్షా సూచించారు. సహకార రంగానికి సంబంధించి 100వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన సభలో అమిత్షా ప్రసంగించారు. పేదల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం గడచిన 8 ఏళ్లలో అనేక కార్యక్రమాలు ప్రారంభించిందని షా చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ అందించడం, వంటగ్యాస్, గృహ, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పించిందని చెప్పుకొచ్చారు. 70 కోట్లమంది పేదలు ఉత్తమ జీవితాలు గడపాలని కోరుకుంటున్నారని, సహకారం రంగం ఒక్కటే దీనిని పరిపూర్తి చేయగలదని అమిత్సా తెలిపారు. గరీబ్ హఠావో అంటూ కాంగ్రెస్ కేవలం నినాదాలు మాత్రమే ఇచ్చిందని, దారిద్య్ర నిర్మూలనకు ఆ పార్టీ చేసిందేమీ లేదని ఆరోపించారు. కేపిటలిజం, కమ్యూనిజం అనేవి పాలనకు సంబంధించి చాలా తీవ్రమైన రూపాలని, దేశానికి సహకారరంగం ఒక్కటే అభివృద్ధి నమూనాకు ఆలంబన అని వ్యాఖ్యానించారు.