కర్ణాటకలో తెరుచుకున్న పాఠశాలలు
అనేక చోట్ల విద్యార్థినులను అడ్డుకున్న టీచర్లు
హిజాబ్ తీయించాకే తరగతిలోకి అనుమతి
తల్లిదండ్రుల నిరసన
కొనసాగిన విచారణ
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాద నేపథ్యంలో మూతపడిన ఉన్నత పాఠశాలలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అనేక చోట్ల విద్యార్థినులు హిజాబ్ ధరించే పాఠశాలలకు రావడం, వారిని ఉపాధ్యాయులు అడ్డుకోవడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడిరది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులు హిజాబ్ తిసేసిన తర్వాతే విద్యార్థినులను లోనికి అనుమతించారు. అనేక చోట్ల టీచర్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మరోవైపు హిజాబ్పై హైకోర్టులో విచారణ జరిగింది. హిజాబ్ లేని వారినే పాఠశాలల్లోకి అనుమతించడాన్ని కొన్నిచోట్ల తల్లిదండ్రులు వ్యతిరేకించారు. మాండ్యలోని రోటరీ పాఠశాలలో ఓవిద్యార్థిని హిజాబ్ ధరించి వచ్చింది. ఆమెను హిజాబ్ తీసేసి లోనికి రావాలని పాఠశాల సిబ్బంది చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలను హిజాబ్తోనే లోపలికి అనుమతించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందితో వాదించారు. చివరకు హిజాబ్ తీసేసిన తర్వాతే సదరు విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించారు. శిమమొగ్గ జిల్లాలోని ఓ పాఠశాలలో హిజాబ్తో తమను తరగతులకు హాజరు కానివ్వలేదని 13మంది విద్యార్థినులు పరీక్షకు బహిష్కరించారు. హిజాబ్తో హాజరైన విద్యార్థినులను గేటు దగ్గర నిలువరించిన సిబ్బంది… హిజాబ్ను తొలగిస్తేనే పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు పరీక్షను బహిష్కరించి పాఠశాల నుంచి వెనుదిరిగారు. కలబురగి జిల్లాలోని ఉర్దూ హైస్కూల్లో దాదాపు 10మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. ఈ విషయంపై పాఠశాల సిబ్బందిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… విద్యార్థినుల హిజాబ్ను తీసేయించారు. సదరు విద్యార్థినులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం వల్ల వారికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల గురించి అవగాహన లేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. వారిని గమనించిన వెంటనే హిజాబ్ను తిసేయించామని పేర్కొన్నారు. బెళగావి జిల్లాలోని అంజుమన్, సర్దార్ పాఠశాలలకు కూడా కొంతమంది విద్యార్థినులు హిజాబ్ ధరించి హాజరయ్యారు. వారిని సిబ్బంది అడ్డుకుని హిజాబ్ తొలగించాలని సూచించారు. తల్లిదండ్రులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలు మాస్క్ను తీస్తారేమో గానీ హిజాబ్ను మాత్రం తొలగించరంటూ వాదించారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ఉడిపి, దక్షిణకన్నడ, మంగళూరు, శివమొగ్గ, బెంగళూరులో ఉన్నత పాఠశాలల వద్ద సెక్షన్ 144 విధించారు. ఈనెల 19వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఉన్నత విద్యాసంస్థలకు ఈనెల 16 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. పరిస్థితులను అంచనా వేసిన తర్వాత డిగ్రీ, ప్రీయూనివర్సిటీ కళాశాలల పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం వెల్లడిరచింది.
వివిధ రాష్ట్రాల్లో నిరసన గళం
మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై విద్యార్థులు నిరసన తెలిపారు. మహారాష్ట్రలోని థానే నగరంలో ఓ మహిళ హిజాబ్ కు మద్ధతుగా ముస్లిం విద్యార్థినులకు అండగా ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేసింది. తమిళనాడులో ఇస్లామిక్ సంస్థలు నిరసనలు తెలిపాయి. సోమవారం కోయంబత్తూరులో ముస్లిం జమాత్ మహిళలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి నిరసన తెలిపారు. శబరిమలలో ముస్లిం బాలికలను హిజాబ్ ధరించకుండా ఆపడాన్ని ఉమెన్ లిబరేషన్ పార్టీ నాయకురాలు వ్యతిరేకించారు. ఉడుపిలోని పాఠశాలల్లో పరీక్షలు సమీపిస్తున్నందున ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని విద్యార్థులు కోరారు.
హైకోర్టులో వాదనలు
హిజాబ్పై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కర్ణాటక హైకోర్టులో సోమవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ నిర్వహించింది. పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్… హిజాబ్పై ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టికల్ 25 ప్రకారం చెల్లదని అన్నారు. హిజాబ్ను ధరించాలా వద్దా అనే విషయాన్ని కాలేజీ కమిటీలు నిర్ణయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లోనూ హిజాబ్ను అనుమతిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మతాచారాలను పాటించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే దాన్ని నియంత్రించవచ్చని అన్నారు.
కుట్రలో భాగమేనన్న కర్ణాటక మంత్రి
కర్ణాటకలో చోటుచేసుకుంటున్న హిజాబ్ వివాదం కుట్రలో భాగమేనని అనుమానిస్తున్నట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆరోపించారు. ఈ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమేనని తెలిపారు. ప్రస్తుతం హిజాబ్ కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.