అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో హిమాచల్ప్రదేశ్లో ప్రచారం జోరందుకున్నది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సిమ్లాలో మీడియాతో మాట్లాడిన బఘేల్.. గత ఐదేండ్లుగా హిమాచల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఇక్కడి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజల సొమ్ము దోచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేసిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఆహార ఉత్పత్తులపై వస్తుసేవల పన్ను అమలు ద్వారా ప్రజలను నిలువుదోపిడీ చేసిందని మండిపడ్డారు. బీజేపీ మొండి వైఖరి దేశంలో నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరిగిపోయిందని బఘేల్ ఆరోపించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మా అంత బలవంతులే లేరని బీజేపీ విర్రవీగుతున్నదని, కానీ అందరికంటే ప్రజలే బలవంతులని ఆయన పేర్కొన్నారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలని హిమాచల్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయ్యారని బఘేల్ చెప్పారు.