న్యూదిల్లీ: మనీలాండరింగ్ కేసులో దిల్లీ ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ను మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీకి స్థానిక కోర్టు గురువారం అనుమతించింది. జైన్ను మరో ఐదురోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయల్ జూన్ 13 వరకు కస్టడీకి అనుమతించారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరపున వాదిస్తూ ఇప్పటి వరకూ జైన్ కస్టడీ సమయంలో అనేక ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించిందని, నగదు, పత్రాలు సహా అనేక ఆధారాలు లభ్యమయ్యాయయని, మరింత విచారణ కోసం జైన్కు మరో ఐదురోజుల కస్టడీ పొడిగించాలని కోర్టుకు విన్నవించారు. ఆ పత్రాల గురించి జైన్ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. జైన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ఈడీ విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఇప్పటికే జైన్ ఈడీ కస్టడీలో ఉన్నారని, కస్టడీని మరింత కాలం పొడిగించాల్సిన అవసరం లేదని కోరారు.