చండీగఢ్/న్యూదిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్మాన్ మార్చి 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దిగ్గజ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ పూర్వీకుల గ్రామం ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దిల్లీలో శుక్రవారం ఆమ్ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో మాన్ భేటీ అనంతరం పార్టీ వర్గాలు ఈమేరకు వెల్లడిరచాయి. అలాగే విజయోత్సవంలో భాగంగా మార్చి 13న పార్టీ అమృత్సర్లో భారీ రోడ్షో నిర్వహించనుంది. ఈ రెండు కార్యక్రమాలకు కేజ్రీవాల్ హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మాన్ శుక్రవారం దిల్లీలో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఢల్లీి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ పంజాబ్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు. ‘పంజాబ్ ముఖ్యమంత్రిగా నా తమ్ముడు భగవంత్మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పలకడానికి నా ఇంటికి వచ్చారు. ముఖ్యమంత్రిగా పంజాబ్ ప్రజల ప్రతి నిరీక్షణను భగవంత్ నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను’ అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. సమావేశానికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన జతచేశారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాన్ కేజ్రీవాల్తో సమావేశం కావడం ఇదే మొదటిసారి.